భగీరథుని కోరిక తీర్చడం కోసం విష్ణుపాదం వదలిన సురగంగ పరమేశ్వరుని జటాజూటంలో చిక్కుకుంది . అటు పిమ్మట పరమేశ్వరుని జటల నుండి క్రిందకు దూకి భూమి మీదకు ఉరికింది . పావనమైన గంగా ప్రవాహాన్ని వర్ణిస్తున్నాడు అపర శివ భక్తుడు పోతన . విష్ణు పదాల నుండి పుట్టిన ఆ పవిత్ర జలాలలో మునిగి పవిత్రులై శ్రీహరిలో ఐక్యమైనవారు కొందరైతే , ఆ గంగా ప్రవాహాన్ని మనసులో ఊహిస్తూ పుణ్యులైనవారు మరికొందరు . పోతన వ్రాసిన ఈ గంగా వర్ణనం మిమ్ములను ఆనంద పరవశులను చేయడమే కాకుండా అడగకుండానే పవిత్రులను చేస్తుంది . పుణ్యం సంపాదించి పెడుతుంది . మీరు చేయాల్సిందంతా ఒక సారి ఆ వర్ణను చదవడం మాత్రమే . ఇది అనంత పుణ్యప్రదం . ఆలస్య మెందుకు ఇక చదవడం మొదలు పెట్టండి .
ఇట్లమ్మహానది , పురారాతి జటాజూట రంధ్రంబు వలన దిగంబడి , నిరర్గళ ప్రవాహంబై , నేలకు జల్లించి నెఱసి , నిండి , పెల్లువెల్లిగొని , పెచ్చు పెరిగి , విచ్చలవిడిం గ్రేపువెంబడి నుఱక క్రేళ్ళుఱుకు మఱక ప్రాయంపు గామధేనువు చందంబున ముందఱికి నిగుడుచు , ముద్దు జందురుతోడి నెయ్యంబున గ్రయ్యనదరి చొప్పుదప్పక సాగి చనుదెంచు సుధార్ణవంబు కైవడి బెంపుకలిగి , మహేశ్వరు వదన గహ్వరంబు వలన నోంకారంబు పిఱుంద వెలువడు శబ్ద బ్రహ్మంబు భంగి నదభ్రవిభ్రమంబున నమ్మహీపాల తిలకంబు తెరువువెంట నంటివచ్చుచు వెలియేనుగు తొండంబుల ననుకరించి ప`రచు వఱద మొగంబులును , వఱద మొగంబుల పిఱుంద నందండ క్రందుకొని , పొడచూపి , తొలంగు బాలశారదా కుచకుంభంబులకు నగ్గలంబైన బుగ్గల సంగదంబునం బారిజాత కుసుమస్తబకంబుల చెలువంబునుం దెఘదు వెలినురువులును , వెలినురువుల చెంగట నర్ధోన్మీలిత కర్పూర తరు కిసలయంబుల గేలిగొను సుళ్ళును ,సుళ్ళ కెలంకుల దహవళ జలధర రేఖాకారంబులు బాగు మెచ్చని నిడుదయేఱులును , నేఱులం గలసి వాయువశంబుల నొండొంతిం దాకి బిట్టు మిట్టించి , మీద కెగయు దురిత భంగంబులును , భంగంబుల కొనల భిన్న భిన్నంబులై కుప్పించి , యుప్పరం బెగసి ;
అర్థం :
విష్ణు పాదాల స్పర్శ చేత పవిత్రమైన గంగా జలాలను తన శిరస్సున ధరించాడు పరమ శివుడు . శివుని జటాజూటంలో చిక్కుకొని బయటకు రాలేక ఉండిపోయింది గంగమ్మ . భగీరథుని మీది దయతో తన జటలను విదలించాడు , కారుణ్య మూర్తి . అప్పుడు ఆ జటలలో రంధ్రాలు ఏర్పడ్డాయి . ఆ రంధ్రాలలోనుండి బయటపడింది పావన గంగ . శివ జటాజూటం నుండి బయల్వెడలిన గంగ నిరర్గళ ప్రవాహంగా రూపందుకొంది . అతిశయంతో — వయసులో ఉన్న కామధేనువు తన కోడెదూడ వెనుక పరిగెత్తినట్టు ముందరికి ప్రవహించింది . ముద్దులొలికే నిండుచందమామ మీద ప్రేమతో ఉప్పొంగే సముద్రుని లాగా పొంగిపోతూ ,మహేశ్వరుని వదన కమలాన్నుండి వెలువడే ఓంకార శబ్దంలా విలాసంగా , విభ్రమంగా , ఐరావత గజ తొండంతో సమానమైన ప్రవాహపు ముందరి భాగంతో ( గంగా ప్రవాహం ఏనుగు తొండంలా ఊగుతూ , మొదటి భాగం సన్నగా , వెనుక భాగం వెడల్పుగా ఉన్నదట ) భగీరథుని అనుసరించింది . గంగా నదిలోని నీటి బుడగలు బాలశారద కుచకుంభాలకన్నా పెద్దవిగా ఉన్నాయి . నీటిబుడగల వలన నురుగు ఏర్పడింది . ఆ నురుగు పారిజాత సుమదళాల కాంతిని మించిపోయింది . ఆ నురగ పక్కనే అర్ధ ఉన్మీలిత (సగం విరిసిన ) కర్పూర చెట్టు చిగుళ్ళ అందాన్ని పరిహాసం చేయగల సుడులనూ , ఆ సుడి పక్కనే తెల్లని మేఘాలను మించిన నీటి ప్రవాహాన్నీ ,గాలి తాకిడికి ఆ ప్రవాహంలో ( ఉత్తుంగ తరంగాలనూ ) వెలసిన పాపాలను పరిమార్చే అలలనూ , ఆ అలలనుండి ముత్యాలసరాలనూ , మల్లెపూల మాలలనూ , కర్పూర ఖండాలనూ , చంద్ర శకలాలనూ , నక్షత్రాల గుంపులనూ పోలి , ముక్తికన్యను వశం చేసుకోగలిగిన నీటితుంపరలను కలిగి , మధ్యమ లోకానికి ( భూలోకం ) శ్రీకరమైంది ఆ గంగా ప్రవాహం .