బ్రహ్మణా సమనుజ్ఞాతః సోప్యుపావిశదాసనే
ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోకపితామహే
తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః
పాపాత్మనా కృతం కర్మ వైరగ్రహణబుధ్ధినా
యస్తాదృసం చారురవం క్రౌంచం హన్యాదకారణాత్
శోచన్నేవ ముహుః క్రౌంచీముపశ్లోకమిమం పునః
జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః .
వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ఆసనం మీద కూర్చున్నాడు. మదిలో వేటగాడు క్రౌంచ పక్షిని వధించిన దృశ్యమే కనిపిస్తోంది. తన నోటినుండి వెలువడిన వాక్కు మరపు రాకుండా ఉంది. బ్రహ్మ దేవుని ముందర కూర్చొని ” మానిషాద –శ్లోకాన్ని మరోమారు చదివాడు.
మానవ స్వభావాన్ని ఈ శ్లోకం చక్కగా చూపుతుంది. ఏదైనా బాధ కలిగినప్పుడు , దుఃఖానికి కారణమైన విషయమే పదే పదే గుర్తుకు వస్తుంది . దీనినే మనం చింత లేక స్ట్రెస్ అని అంటాము. చింత ఎక్కువకాలం ఉంటే అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే . మహర్షి అయినా విషయ చింత వాల్మీకిని వదల లేదు . కానీ రామాయణాన్ని రాయాలంటే దీర్ఘంగా అలోచించడం , భావుకుడైపోవడం అవసరం . అదే ఇక్కడ జరిగింది. చింతించడం కూడా కొద్దిసేపే . బ్రహ్మదేవుని ప్రేరేపణతో రామాయణాన్ని రాయడానికి నిర్ణయించుకొన్న మరుక్షణం దుఃఖం మటుమాయమై పోతుంది. జరిగే ఘటనలన్నీ మహర్షిని రామాయణ రచనకు ఉపక్రమింపజేయడానికి దోహదపడేవిగా ఉండాలని భగవత్ సంకల్పం. ముందు ముందు ఇది ఇంకా తేట తెల్ల మవుతుంది .