నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః
పూజయా మాస ధర్మాత్మా సహశిష్యో మహామునిః
యథావత్పూజితస్తేన దేవర్షిర్నారదస్తథా
అపృష్ట్వైవాభ్య నుజ్ఞాతస్స జగామ విహాయసం .
ముగ్ధ మనోజ్ఞ దర్శనుడు , శారదామూర్తి , వాక్య విశారదుడైన వాల్మీకి మహర్షి , రమ్యంగా రామకథను వినిపించిన నారదుణ్ణి పూజించాడు. పూజలందుకొన్న పుణ్యుడు , మహర్షి అనుజ్ఞ్గ తీసుకొని అకాశమార్గాన దేవలోకానికి వెళ్ళిపోయాడు.
ఆదికవి మనసులో ఇతిహాస రచన కంకురార్పణ జరిగింది.ఇక ఆ విత్తు మహావృక్షమై , అనేక శాఖలతో అలరారడానికి సమయ మాసన్నమయింది. మానవాళి మనుగడకు అర్థం విశదపరచబడింది.సుందరమూ, సుమధురమూ సుమనోహరమూ , గంభీరమూ, ముక్తిప్రదమూ , కమనీయమూ, మోక్షదాయినీ ,తరతరాలకు మార్గదాయినీ కాబోయే మహనీయ గ్రంధాన్ని ఇక మనకు ప్రసాదిస్తాడు మహర్షి. శారదాదేవి ఆనందంతో పొంగిపోయింది. ముగ్ధమోహనంగా దరహాసం చేసింది .
భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః అంటే “శుభమైన దానినే మా చెవులతో వింటామని” . ప్రార్థనా మంత్రాలలో వేద ఋషులు అన్నట్లుగా , ఇక మనం వినేదంతా మంచే , శుభప్రదమే . దరహాసం చేసింది .
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య గారు “వందే వాల్మీకి కోకిలం ” అనే పద్య ఖండికలో
వాల్మీకి మహర్షికి అంజలి ఈవిధంగా ఘటించారు.
తీయని పదాల “రామా , రామా” యటంచు
తీయ తీయగ రాగాలు తీయుచున్న
కమ్మకైతల క్రొమ్మావి కొమ్మమీది
ఆదికవి కోకిలస్వామి కంజలింతు