అనేన తోషితశ్చాసీదత్యర్థం రఘునందన
విససర్జ తతో గంగాం హరో బిందుసరః ప్రతి
తస్యాం విసృజ్యమానాయాం స్రోతాంసి జజ్ఞిరే
హ్లాదినీ పావనీ చైవ నళినీ చ తథాపరా
తిస్రః ప్రాచీం దిశం జగ్ముర్గంగాః శివజలాః సుభాః
భక్త సులభుడైన శంకరుడు సులభంగానే కరుణించాడు . బిందు సరస్సు వద్ద గంగానదిని ఏడు ప్రవాహాలుగా వదిలాడు . అవి హ్లాదిని , పావని , నళిని , సుచక్షువు , సీత , సింధు , గంగ . వీటిలో హ్లాదిని, పావని , నళిని — అనే పేర్లుగల పవిత్ర గంగా జలాలు తూర్పు దిక్కుగా ప్రవహించాయి .
సుచక్షుస్ఛైవ సీతా చ సింధుశ్చైవ మహానదీ
తిస్రస్త్వేతా దిశం జగ్ముః ప్రతీచీం తు శుబోధకాః
సప్తమీ చాన్వగా త్తాసాం భగీరథ్మథో నృపం
భగీరథోపి రాజర్షిర్దివ్యం స్యందనమాస్తిథః
ప్రాయాదగ్రే మహాతేజా గంగా తం చాప్యనువ్రజత్
సుచక్షువు , సీత , సింధు గంగా జలలు పశ్చిమ దిశగా ప్రవహించాయి .ముఖ్యమైన గంగా పాయ భగీరథుని అనుసరించింది . ముందు భగీరథుడు ,ఆతని వెనువెంటనే గంగమ్మ . చూడ చక్కని దృశ్యం .
ఆలోచన :
వాల్మికి రామాయణం ప్రకారం పరమ శివుడు గంగను వదిలిన ప్రాంతం బిందు సరస్సు . ప్రస్తుతం ఒక బిందు సరస్సు గుజరాత్లో ఉంది . అంటే భగీరథుడు ఈ ప్రదేశం నుండే గంగను తన పితరులకు తర్పణాలు వదలడానికి తీసుకొని వెళ్ళి వుండాలి . కానీ ప్రస్తుతం గంగా నది హిమవత్పర్వత ప్రాంతమయిన ” గోముఖ్” దగ్గరనుండి తన పయనాన్ని ఆరంభిస్తుంది . అంటే పరమ శివుడు గోముఖ్ దగ్గర గంగను విడిచిపెట్టి వుండాలి కదా ? అందునా గంగా నది శివలింగ్ పర్వతంక్రింద ఉన్న గోముఖ్ వద్ద జనిస్తుంది .హిమాలయాలలోని ” శివలింగ పర్వత ” ప్రాంతంలో ” సీత” అనే పేరుగల ఉపనది గంగానదిలో కలుస్తుంది .
ఇక బిందు సరోవర ప్రాంతం , సిధ్ధపూర్ ( పటాన్ జిల్లా ) , గుజరాత్ లో ఉంది . కపిల మహర్షి తపస్సు చేసిన స్థలమిదే . ఈ ప్రదేశం పురాణ కాలంలో ప్రసిధ్ధమైన “సరస్వతీ” నదీమతల్లి తటాన వెలసిందని చెబుతారు . ఈ ప్రదేశాన్ని గంగా సరస్వతీ నదుల సంగమ స్థానంగా కూడా చెబుతారు . దధీచి తన వెన్నెముకను ( వజ్రాయుధాన్ని చేయడం కోసం ) ఇంద్రుడికి దానమిచ్చిన స్థలం కూడా ఇదేనని చెబుతారు . ఈ స్థలంలో తల్లులకు తర్పణం ఇవ్వడం ఆనవాయితీ . పరశురాముడు కూడా తన తల్లి రేణుకా దేవికి ఇక్కడ తర్పణం ఇచ్చాడని చెబుతారు .
నాకు మాత్రం శివలింగ్ పర్వత సాణువులలోనే శివ జటాజూటం నుండి గంగా నది భూతలానికి వచ్చిందని అనిపిస్తుంది .
మాటలో మాట భారత దేశంలో ప్రసిధ్ధమైన సరస్సులు అయిదు . అవి వరుసగా : మానస సరోవరం ( లడఖ్ -చైనా) , బిందు సరోవరం ( గుజరాత్ పటాన్ ) , నారాయణ సరోవరం ( కచ్), పంపా సరోవరం ( హంపి) , పుష్కర్ (రాజస్థాన్) ” అనే పంచ సరస్సులు . ఈ సరస్సులలో స్నానం చేయడం పాపఘ్నం , పరమ పుణ్య ప్రదం అని హిందువుల విశ్వాసం .