త్వాం నియోక్ష్యామహే విష్ణో లోకానాం హితకామ్యయా
రాజ్ఞో దశరథస్య త్వమయోధ్యాతిపతేః ప్రభోః
ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షిసమతేజసః
తస్య భార్యాసు తిసృషు హ్రీశ్రీ కీర్త్యుపమాసు చ
విష్ణో పుత్రత్వమాగచ్ఛ కృత్వాత్మానం చతుర్విధం
పరమాత్ముని తనివితీరా ప్రార్థించిన పిదప లోక కల్యాణం కోసం ” ధర్మజ్ఞుడైన దశరథుని తనయుడుగా ” ఆవిర్భవించమని అర్థించారు “.
” దశరథుని భార్యలు హ్రీ , శ్రీ , కీర్తులతో ( వీరందరూ దిక్పాలకుడైన దక్ష ప్రజాపతి కుమార్తెలు ) సమానులు . దశరథుడేమో , మహర్షులతో సమానమైన దివ్యతేజం కలవాడు . మీ ఆత్మను నాలుగుభాగాలుగా విభజించి , రఘుకులంలో జన్మించి , రావణున్ని రణంలో సంహరించండి ” అని దీనంగా విష్ణువు నర్థించారు దేవతలు .
తత్ర త్వం మానుషో భూత్వా ప్రవృధ్ధం లోకకణ్టకం
అవధ్యం దైవతైర్విష్ణో సమరేజహి రావణం .
స హి దేవాంశ్చ గంధర్వాన్ సిధ్ధాంశ్చ మునిసత్తమాన్
రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధతే
ఋషయశ్చ తతస్తేన గంధర్వాసరస్తథా
క్రీదంతో నందనవనే క్రూరేణ కిల హింసితాః
బ్రహ్మ ప్రసాదించిన దివ్యమైన వరాలు రావణుని అజేయునిగా చేసాయి . అజేయుడననే గర్వంతో ఆతడు సాధువులైన దేవ , గంధర్వులనూ , అబలలైనా అని చూడకుండా అప్సరసలనూ హింసిస్తున్నాడు . సిధ్ధులూ , ఋషులమాట వేరుగా చెప్పాలా . దశరథ తనయునిగా ధరలో జన్మించి , రావణుని సంహరించి మమ్ములను రక్షించవా .
వధార్థం వయమాయాతాస్తస్య వై మునిభిః సహ
సిధ్ధగంధర్వయక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః
త్వం గతిః పరమా దేవ సర్వేషాం నః పరంతప
వధాయ దేవశత్రూణాం నృణాం లోకే మనః కురు .
“నీవేతప్ప ఇతః పరంబెరుగ , మన్నిపందగున్ దీనులన్ , కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా ” అని కనుల నిండుగా కన్నీరు కారుతుండగా భగవంతుని శరణుజొచ్చారు . “అన్యధా శరణం నాస్తి , త్వమేవ శరణం మమ ” అని ప్రార్థించి రావణ సంహారానికి నరుడుగా నరలోకంలో అవతరించమని అవనత వదనులై అంజలి ఘటించి దేవదేవుని వేడుకున్నారు .