ఏవముక్తాస్త తస్తాభ్యాం సర్వ ఏవ మహర్షయః
విశ్వామిత్రం పురస్కృత్య రామం వచన మబ్రువన్
మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి
యజ్ఞః పరమధర్మిష్టస్తస్య యాస్యామహే వయం
త్వం చైవ నరశార్దూలస్సహాస్మా భిర్గమిష్యసి
అద్భుతం ధనురత్నం చ తత్ర తద్దృష్టుమర్హసి
విశ్వామిత్రుని సమీపంలో ఆశీనులైన మునులు విశ్వామిత్రుని అనుజ్ఞపొంది ” రామా ! మిథిలా నగరంలో జనకమహారాజు ధర్మ సంయుతమైన యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించాడు . మేమందరమూ ఆ యజ్ఞానికి వెడుతున్నాము . నరశార్దూలా ! మీరు ఆ యజ్ఞానికి మాతో కలిసి దయచేయాలి . జనక మహారాజు ఆస్థానంలో ధనస్సులలో రత్నం లాంటి ఒక ధనస్సు ఉంది . వీరుడవైన నీవు ఆ ధనస్సును చూసి తీరాలి . అది చూడడానికి నీవు అర్హుడవు ” అని పలికారు .
అథతాం రజనీం తత్ర కృతార్థౌ రామలక్ష్మణౌ
ఊఊషతుర్ముదితౌ వీరౌ ప్రహృష్టేనాంతరాత్మనా
ప్రభాతాయాం తు శర్వర్యాం కృతపౌర్వాహ్ణికక్రియౌ
విశ్వామిత్రమృషీంశ్చాన్యాన్ సహితావభిజగ్మతుః
అభివాద్య మునిశ్రేష్టం , జ్వలంతమివపాదుకం
ఊచతుర్మధురోదారం వాక్యం మధురభాషిణౌ
ఇమౌ స్మ మునిశార్దూల కిఙ్కరౌ సముపస్థితౌ
ఆజ్ఞాపయ యథేష్టం వై శాశనం కరవామ కిం
శ్రీయుతమూర్తులు సఫలంగా తండ్రి ఆజ్ఞను నిర్వర్తించారు . కృతార్థులైనారు . వారి మనస్సులలో ఒక రకమైన ఆనంద డోలిక , నిర్వచించలేని ప్రశాంతత అలముకున్నాయి . ముని యజ్ఞం కాచే దాకా నిద్రలేని వారికి , గాఢనిద్ర ముంచుకు వచ్చింది . నిశీధి సమయంలో నిశ్చింతగా నిదుర పోయారు . చూస్తూండగానే చీకట్లను చీల్చుకుంటూ భానుడుదయించాడు . బాలమయూఖమాలికలు కలకలలాడుతూ జగత్తునాక్రమించాయి . అటువంటి సుప్రభాత సమయంలో నిదురలేచారు రామలక్ష్మణులు . స్నానం చేసి భానుడికి అర్ఘ్యమిచ్చారు . పిదప మందగమనంతో విశ్వామిత్ర మహర్షి సముఖానికి చేరారు . సవినయంగా అభివాదనం చేసారు . అసమానమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు విశ్వామిత్రుడు . అగ్నివలె జ్వలిస్తున్నాడట . మృదుమధురంగా మాటలాడే స్వభావం వారిది . ” మీ ఆజ్ఞు పాలించడానికి మేము సిధ్ధంగా ఉన్నాము . యధేచ్ఛగా అజ్ఞాపించండి ” అని మందస్మితవదనంతో , మధురంగా ఉదారంగా పలికారు .
శేషాన్ వాయవ్యమాదాయ నిజఘాన మహాయశాః
రాఘవః పరమోదారో మునీనాం ముదమావహన్
స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞ్యఘ్నాన్రఘునందనః
ఋషిభిః పూజితస్తత్ర యథేంద్రో విజయే పురా
“అవా యవ్యయా వాయవ్యా అపోవాయ యయావాయవ్యోం — ” అనే వాయవ్యమంత్రాన్ని అనుసంధించి వాయవ్యాస్త్రాన్ని ఇతర రాక్షసుల మీద ప్రయోగించాడు రఘురాముడు . ఆ అస్త్ర ప్రయోగంతో రాక్షస సంహారం విజయవంతంగా ముగిసింది . యాగాన్ని కాచిన రామచంద్రుని దేవేంద్రుని పూజించినట్లు పూజించారట ఋషులు .
అథ యజ్ఞే సమాప్తే తు విశ్వామిత్రో మహామునిః
నిరీతికా దిశో దృష్ట్వా కాకుత్సమిదమబ్రవీత్
కృతార్థోస్మి సత్యం కృతం గురువచస్త్వయా
సిధ్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశః
రాక్షసులు మరణించారు . యజ్ఞం నిర్విఘ్నంగా సమాప్త మయింది . నలుదిక్కులలోని ఈతి బాధలన్నీ తొలగి పోయాయి . విశ్వామిత్ర మహర్షి సంతోషంతో ” రామా ! కృతార్థుడనయినాను . తలపెట్టిన కార్యక్రమం జయప్రదంగా ముగిసింది . సిధ్ధాశ్రమమంటే తలచుకున్న పని సిధ్ధింపజేసే ఆశ్రమమని . నీవు సిధ్ధాశ్రమం పేరు సార్థకం గావించావు . తండ్రి ఆజ్ఞను నిర్వర్తించి గురువచనాన్ని ( తండ్రి మాటను ) సఫలం చేసావు ” అని సంతోషంతో పలికాడు .
శిష్యుడంటే శ్రీరాముడే . భయంకరులైన రాక్షసులను వధించాడు .సిధ్ధాశ్రమంలో నివసించే ఋషుల భయాన్ని తొలగించాడు . గర్వం మాత్రం అతని దరిచేరలేదు . అటువంటి సమర్థుడూ , ఆజ్ఞపాలించే శిష్యుడు లభించిన విశ్వామిత్రుడు ధన్యుడు . గాయత్రీ మంత్ర దృష్ట , సకలాస్త్ర మంత్రవేత్త , విశ్వామిత్రుని వంటి గురువు లభించడం రాముని అదృష్టం . అటువంటి గురు శిష్యుల కథ రాసిన వాల్మీకి పూజ్యుడు . ఆ కథ విని ఆనందించే మనం ధన్యులం .
పశ్య లక్ష్మణ శీతేషుం మానవం ధర్మసంహితం
మోహయిత్వా నయత్యేనం న చ ప్రాణైర్వ్యయుజ్యత .
ఇమానపి వధిష్యామి నిర్ఘృణాన్ దుష్టచారిణః
రాక్షసాన్ పాపకర్మస్థాన్ యజ్ఞఘ్నాన్ రుధిరాశనాన్
” మానవాస్త్రం మోహం కలిగించే చల్లని బాణం . శత్రువును యుధ్ధభూమినుంచి దూరంగా తీసుకుపోయే స్వభావం కలది . ప్రాణాలు తీయదు . మారీచుని ఏ విధంగా తీసుకొని పోతున్నదో గమనించమని చెబుతూ , ఇక దుర్మార్గులూ , జాలి లేని వారూ , యజ్ఞాలకు విఘ్నాన్ని కలిగించే వారూ అయిన ఇతర రాక్షసులను వధిస్తాను చూడు లక్ష్మణా ” అని అన్నాడు .
సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయ మద్భుతం
సుబాహూరసి చిక్షేప స విధ్ధః ప్రాపతద్భువి .
అంటూనే అద్భుతమైన ఆగ్నేయాస్త్రాన్ని అమ్ములపొదిలోనుండి అందుకున్నాడు . సుబాహుని గుండెకు గురిచూసి దాన్ని వదిలాడు ( పావకసర సుబాహు పుని మారా , అనుజ నిశాచర కటకు సంఘారా – తులసిదాసు మాటలలో) . సుబాహుని రొమ్మునుండి రుధిరం బయటకు చిమ్మింది . శవమైపోయాడు సుబాహుడు .
తావాపతంతౌ సహసా దృష్ట్వా రాజీవలోచనః
లక్ష్మణం త్వభిసంప్రేక్ష్య రామో వచనమబ్రవీత్
పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్ రాక్షసాన్ పిశితాశనాన్
మానవాస్త్ర సమాధూతాననిలేన యథా ఘనాన్
మానవం పరమోదారమస్త్రం పరమభాస్వరం
చిక్షేప పరమ క్రుధ్ధో మారీచోరసి రాఘవః .
రుధిరంతో వేదిక ప్రజ్వరిల్లింది . అది రాఘవుడి కంటపడింది . పరుగుపరుగున అరుదెంచాడు వేదికవద్దకు . కనిపించారు అకాశంలో రాక్షసులు . లక్ష్మణుని వంక చూచాడు రాజీవలోచనుడు . లక్ష్మణా ! ” దుర్మార్గులూ , నరమాంస భక్షకులూ అయిన ఈ అసురులను మానవాస్త్రం ప్రయోగించి , వాయువు ఏ విధంగా మేఘాలను చిందరవందర చేస్తుందో , ఆ విధంగా ఎగరగొడతాను ” చూడమన్నాడు . అనడమేకాదు , భాస్కరుని లాగా వెలుగులు చిమ్ముతూ , శత్రువులను దూదిపింజలా ఎగరగొట్టే మానవాస్త్రాన్ని సంధించి మారీచుని ఉరానికి ( వక్షస్థలం ) గురిచూచి వదిలాడు .
స తేన పరమాస్త్రేణ మానవేన సమాహతః
సంపూర్ణం యోజనశతం క్షిప్తః సాగర సంప్లవే
విచేతనం విఘూర్ణంతం శీతేషుబలతాడితం
నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణ మబ్రవీత్
మానవాస్త్రం మహనీయమైన శక్తి కలది . రాముడు వదలగానే మారీచుని తాకింది . తాకిన మరుక్షణం దూదిపింజలా ఎగిరిపోయాడు . మారీచుణ్ణి వాయువు మేఘాలను ఎగరగొట్టినట్టుగా ఎగర గొట్టింది . వందయోజనాల దూరంలో పొంగిపొరలే సముద్ర జలాల మధ్య పడ్డాడు
రామాయణ మననంలో వేయి శ్లోకాలు పూర్తి అయినాయి . విశేషమేమిటంటే గాయత్రీ మంత్రంలో రెండవ అక్షరమైన ” స ” రెండవ అక్షరంగా , రామాయణంలో , రెండవ వేయి శ్లోకారంభంలో ఉంచబడడం .
Details of manavastra :
manavastra is a weapon which does not kill . It is called paramoadaara . udaaram means does not hurt or kill .
మానవాస్త్రం పరమోదారమైన అస్త్రమట . ” మానవం పరమోదారమస్త్రం ” అని వాల్మీకి మహర్షి వాక్యం . అస్త్రాలన్నీ చంపడానికి ఉపయోగించేవే . కానీ మానవాస్త్రం యొక్క ఉద్దెశ్యం అది కాదు . భూత , భవిష్యద్ ,వర్తమాన కాలాల జ్ఞానం కలిగిన రామచంద్రుడు మారీచుణ్ని చంపకుండా భయభ్రాంతుణ్ణి చేశాదు . ముందు జరుగ బోయే రామాయణకథకు మారీచుని అవసరం ఎంతైనా ఉంది మరి . ” శీతేషు ” అంటే చలువ కలిగించేదని అర్థం . ఈ బాణం శత్రువును బాధించదు . వానిలో భయాన్ని నింపుతుంది . రాముడు లక్ష్మణునితో ” ఈ అస్త్రం శత్రువులకు మోహం మాత్రమే కలిగిస్తుంది . ప్రాణాలు తీయలేదు ” అని చెప్పాడు . ప్రతి చిన్న విషయాన్నీ అతి నిశితంగా పరిశీలించి రాయడం వాల్మీకి మహర్షికి అలవాటు . ఇక రాముడంటారా ! ముందు చూపుతో ఏ పని ఏవిధంగా చేయాలో తెలిసిన విజ్ఞుడు .