అథ తస్యాప్రమేయస్య మునేర్వచనముత్తమం
శ్రుత్వా పురుషశార్దూలః ప్రత్యువాచ శుభాం గిరం
అల్పవీర్యా యదా యక్షాః శ్రూయంతే మునిపుఙ్గవ
కథం వాగసహస్రస్య ధారయత్య బలాబలం
అప్రమేయ ప్రభావం కలిగిన విశ్వామిత్రుడు పలికిన మాటలు ఆలకించి శ్రీరామచంద్రుడు ” మహర్షీ ! యక్షులు అల్పవీర్యులని అంటారు కదా . ఈ అబలకు (తాటకకు ) వేయి ఏనుగుల బలం రావడానికి కారణమేమిటి ? ” అని కౌశికుని ప్రశ్నించాడు .
శ్రీరామచంద్రుని గుణాలలో ముఖ్యమైనది ” క్యూరియాసిటీ .” ప్రశ్నించకుండా వదిలిపెట్టడు . జీవితంలో అభివృధ్ధి పొందాలనే కోరికగలిగిన యువకులందరూ అలవరచుకోవలసిన ముఖ్య లక్షణం ” విజ్ఞులను ప్రశ్నలడిగి తమ జ్ఞానాన్ని పెంపొందిచుకోవడం “.
తాటక సంహారానికి నాందీ వాక్యం పలికాడు కౌశికుడు . తాటకను అవలీలగా కూల్చాడు శిష్యుడు శ్రీరాముడు . ఈ ఘట్టాన్ని అతిరమణీయమైన అంత్యప్రాసలతో మనకందించాడు కైవల్య పదాన్ని కోరుకున్న పోతన్న . పోతన్న పద్యం వీనులకు విందు . మరిదుగో విందుపదార్థాన్ని మీ విస్తరిలో వడ్డిస్తున్నాను , ఆస్వాదించండి .
సవరక్షార్థము తండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడ రా
నవలీలం దునుమాడె రాండదయుండై బాలుడై కుంతల
చ్ఛవిసంపజ్జిత హాటకం గపటభాషవిస్ఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం గరవిరాజత్ఖేటకన్ దాటకన్
” బాలుడైన రాముడు తండ్రిగారి ఆజ్ఞ ప్రకారం తపసి యాగాన్ని కాపాడడానికి కౌశికుని అనుసరించి వెళ్ళి — బంగారు రంగుజుట్టూ , కపటపు మాటలూ , గుఱ్ఱం వంటి వడిగల పరుగూ , చేతిలో డాలూ కల తాటకను సంహరించాడు ” అని ఈ పద్యం భావం .