దివసే దివసే తత్ర సంస్తరే కుశలా ద్విజాః
సర్వకర్మాణి చక్రుస్తే యథాశాస్త్రం ప్రచోదితాః
నా షడంగ విదత్రా సీన్నావ్రతో నా బహుశ్రుతః
సదస్యాస్తస్య వై రాజ్ఞో నావాదకుశలా ద్విజాః
ఆ యజ్ఞ వాటికలో , బ్రాహ్మణులు ప్రతి చిన్న విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తూ , కర్మలలో లోపంలేకుండా , సశాస్త్రీయంగా యజ్ఞాన్ని నిర్వహించారు . కార్యక్రమాలను జాగర్తగా గమనిస్తూ , అవసరమైనప్పుడు ప్రోత్సహాన్నందిస్తూ వసిష్ఠ మహర్షి వారికి అండగా ఉన్నారు .
యజ్ఞం చేసే బ్రాహ్మణులందరూ శాస్త్రకోవిదులు , షడంగవేత్తలు ( శిక్ష , , వ్యాకరణ , నిరుక్త , చందస్సు , జ్యోతిషం , కల్పాలను వేదాంగాలని లేక షడంగాలని అంటారు) .
శిక్ష : శిక్ష అంటే స్వర , వర్ణ , మాత్ర ఉచ్చారణ విధానాలను తెలిపే శాస్త్రం .
వేదాలు సుస్వరంగా చదవాలి . అలా చదవకపోతే పదాల అర్థమే మారిపోయే ప్రమాదముంది . సుస్వరంగా చదివితే వేదాలను మననం చేయడం , జ్ఞాపకముంచుకోవడం లాంటివి సులభమవుతాయి . పుస్తకాలు లేని రోజులలో స్వర పధ్ధతినుపయోగించి వేదాలను లుప్తం కాకుండా మహర్షులు మనకందించారని నాకనిపిస్తుంది . ఉదాత్త , అనుదాత్త స్వరాలనుపయోగించి భావితరాలవారికి జ్ఞానాన్నందించిన మహనీయులు మనకు చిరస్మరణీయులు . షడంగాలలో ఒకటైన శిక్ష స్వర విజ్ఞానాన్ని మనకు నేర్పుతుంది . శిక్షా శాస్త్రాన్ని తెలిపే గ్రంధాలు అనేకం ఉన్నాయి .
వ్యాకరణం : పాణిని రచించిన అష్ఠాధ్యాయి ప్రసిధ్ధమైన వ్యాకరణ గ్రంధం . ఈ గ్రంధంలో రమారమి 8000 సూత్రాలున్నాయి . ప్రపంచంలో దీనికి దీటు రాగల వ్యాకరణ గ్రంధం ఇంకొకటి లేదని ఘంటాపధంగా చెప్పవచ్చు .
నిరుక్తం : నిరుక్తం : వేదాలలో కనిపించే కష్టమైన , లుప్తమైన పదాలకు వివరణ ఇచ్చే శాస్త్రం నిరుక్తం . పురాతనమైన కారణంగా వేద కాలంలోని భాషనర్థం చేసుకోవడం చాలా కష్టం . శ్రమతో కూడుకున్న పని .
శబ్దాల ఉత్పత్తిని గురించి ప్రవచించే శాస్త్రం , నిరుక్తం . ధాతువుల ఆధారంగా పదాలు ఎలా ఏర్పడ్డాయో తెలుపడమే కాకుండా , ఆ పదాల అర్థాన్ని తెలుసుకోవడానికి సహాయపడేది నిరుక్తం . యాస్క మహర్షి రచించిన నిరుక్తం వేద శబ్దాలను అర్థం చేసుకొవడానికి మనకు దోహద పడుతున్న గ్రంథం .
ఛందస్సు : స్తోత్ర రచన చేయడానికి ఛందస్సు అవసరం.
అక్షరాలను ఉచ్చరించడానికి తీసుకొనే సమయాన్ని బట్టి గురువు లేక లఘువులుగా విభజించారు . ఏక మాత్ర కాలం లో ఉచ్చరించ గలిగేది లఘువు అంటారు. ఉచ్చరించడానికి రెండు మాత్రల సమయం అవసరమవుతే ఆ అక్షరాలను గురువని అంటారు . మాత్ర అంటే చిటికవేయడాని తీసుకొనే సమయం . గురు లఘువుల కలయికతో గణాలేర్పడతాయి . గణాల అమరికనే ఛందస్సని అంటారు . ఛందస్సు ఆధారంగా వేద మంత్రాలు నిర్మింప బడ్డాయి . వేద మంత్రాలు గాయత్రి , అనుష్ఠుప్ , త్రిష్ఠుప్ , జగతి అనబడే ఛందస్సులలో రచింపబడ్డాయి . పింగళుడి ఛందోశాస్త్రం ప్రామాణ్య గ్రంధం .
17.288696
78.604046