వీరాశ్చ నియతోత్సాహా రాజశాస్త్ర మనుష్టితాః
శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినాం
రాజ్యంలోని మంచివారందరకూ రక్షణ కల్పించేవారు . చలించని ఉత్సాహం కలవారూ , వీరులూ అయిన ఆ మంత్రులు శాస్త్ర సమ్మతంగా రాజ్యాన్ని పరిపాలించేవారు .
రాజ్య పాలనలో అతి ముఖ్యమైన అంశం సుజన రక్షణ . విద్యావంతులూ , ఇతరుల క్షేమంకోరేవారూ , సామాన్య ప్రజలూ , నిర్భయంగా జీవనం గడపాలంటే వారికి రక్షణ అవసరం .రక్షణ లేనప్పుడు సామాన్యులను భయపెట్టి తమ పబ్బం గడుపుకుంటారు దుష్టులు . భయం వల్ల నోరు మెదపరు శిష్టులు . భయమన్నది మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది . మంచి వారికి గల సామర్థ్యం ఎందుకూ కొరగాకుండా పోతుంది . సామాన్య ప్రజలకు రక్షణ కల్పించడం మానేసి తమ చుట్టూ రక్షణ వలయాలు నిర్మించుకుంటున్నారు మన నేతలు . ప్రస్తుతం, మనదేశంలో సామర్థ్యమున్న మంచి మనుష్యులు రాజకీయలలోకి రాకుండా ఉండడానికి కారణం దుష్టులైన రాజకీయ నాయకుల దుష్కృత్యాల కారణంగానేమో అని నాకనిపిస్తుంది . సామాన్యులను భయపెట్టడం దుష్టులకానందం , లాభదాయకం . భయంతో బిక్కు బిక్కు మంటూ బతికే ప్రస్తుతంకన్నా పూర్వకాలపు జీవితమే హాయిగా ఉండేదేమో అన్న సందేహం రాక మానదు.
17.288696
78.604046
కోశసంగ్రహణే యుక్తా బలస్య చ పరిగ్రహే
అహితం చాపి పురుషం న విహింస్యురదూషకం
భావం : రాజ్యానికవసరమైన ధనాన్ని సమకూర్చడం , సైన్యాన్ని సమీకరించడం , న్యాయ పరిరక్షణ (అపరాధిని మాత్రమే శిక్షించి అమాయకులకు శిక్ష పడకుండా చూడడం ) దశరథుని మంత్రుల విధులు . ఈ కార్యాలను వారు చక్కగా నిర్వర్తించేవారు .తప్పు చేయక పోతే శత్రువును కూడా హింసించని స్వభావం వారిది.
రాజు సత్కార్యాలు చేయాలనుకొంటే ధనమవసరం . ఆ ధనాన్ని సమకూర్చడం అమాత్యుల పని . మన ధర్మశాస్త్రాల ప్రకారం ప్రజలు సంపాదించిన ధనంలో (ధాన్యమైనా కూడా) ఆరవ భాగం సుంకంగా చెల్లించాలి . వేరే ఏ ఇతర సుంకాలూ ఉండేవి కాదు . ఈ సుంకం మరీ ఎక్కువ కాదు కనుక ప్రజలందరు కూడా సంతోషంగా చెల్లించేవారు . ప్రతిఫలంగా రాజు ప్రజోపయోగమైన పనులన్నీ చేసేవాడు . ప్రజలకు రక్షణ కల్పించే వాడు . ప్రజలను తన స్వంత బిడ్డలవలే చూసుకునే వాడు . తప్పు చేస్తే తన కొడుకునైనా శిక్షించకుండా వదిలేవాడు కాదు . రాజు రాజ్యాన్ని న్యాయ మార్గంలో పాలించేటట్టు చేయడం అమాత్యుల పని .
ప్రస్తుత పరిస్థితులను గమనించండి . పన్నులను విధించడంలో మనవారిని మించిన వారెవరూ లేరు . దేశాభివ్రధ్ధికి ఖర్చు పెట్టల్సిన ధనాన్ని ఇంతవరకూ పరోక్షంగా తమ వశం చేసుకొన్న ప్రజా నాయకులు ప్రస్తుతం జీతభత్యాల పేరుతో తమ ఆదాయాన్ని విపరీతంగా వృధ్ధి చేసుకొనడం మనకందరకూ తెలిసిన విషయమే . తమ స్వంత సుఖాలను మాత్రమే పట్టించుకొని ఇతర ప్రజల మధ్యలో విద్వేషాలు రగిలించి తమ పబ్బం గడుపుకొనే నాయకుల పరిపాలనలో మనం జీవిస్తున్నాం . ప్రజాస్వామ్యమనే పేరుగల వ్యవస్థలో కొందరు దుర్మార్గుల చేతిలో నలిగి పోతున్నాం . స్వంత లాభం కొంత మానుకొని ఇతరులకు ఉపయోగపడమని మహనీయులు మొత్తుకున్నా , ఆ ఆక్రందనలు ఈ దుర్మార్గుల చెవి సోకవు .
ఇక న్యాయ వ్యవస్థను గూర్చి ఎంత తక్కువగా మట్లాడితే అంత మంచిది . తప్పులు చేసినా తప్పించుకుంటున్నారు ధనవంతులు . పదిమంది ప్రజలను పోగు చేసి పదివేలమందిని బాధ పెట్టే పాలకులు మనవారు . డబ్బులకమ్ముడు పోయే న్యాయాధీశులనెంతమందినో మనం చూస్తున్నాం . ఇక సామాన్యుడికి న్యాయం చేసేదెవరు . ప్రజాస్వామ్యం ముసుగులో , ” మైట్ ఈస్ రైట్ ” అనే ఆటవిక వ్యవస్థలో మనమున్నామని కొద్దిగా ఆలోచిస్తే అర్థమవుతుంది . ఇంతకంటే రాజరికమే మేలేమో?
17.288696
78.604046