తత్ శ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహామునిః
ప్రత్యువాచ శతానందం వాక్యజ్ఞో వాక్య కోవిదం
నాతిక్రాంతం మునిశ్రేష్ఠ యత్కర్తవ్యం కృతం
మయా సంగతా మునినా పత్నీ భార్గవేణేవ రేణుకా
విశ్వామిత్ర మహర్షి వాక్యజ్ఞుడు (విద్వాంసుడు ) . ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలిసిన వాడు . వాక్య కోవిదుడైన శతానందుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ” చేయవలసిన పనులన్నీ చేసాను . ఏ పనినీ అసంపూర్తిగా వదిలి వేయలేదు , విడువ లేదు . రేణుక ( పరశురాముని కన్న తల్లి ) జమదగ్ని మహర్షిని చేరిన విధంగా అహల్య గౌతమ మహర్షిని చేరింది ” అనే మంగళకరమైన మాటలను పలికాడు .
నోట్ : జమదగ్ని మహర్షికి కోపం వచ్చి భార్య అని కూడా చూడకుండా రేణుకను స్వంత కుమారుడైన పరశురామునిచేత చంపించాడు . తండ్రి తపశ్శక్తితో ప్రాణాలను ఇవ్వగలడన్న సత్యాన్ని తెలిసిన పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాలించి తల్లి తలను నరికాడు . ఆజ్ఞ పాలించిన కుమారుణ్ణి చూసి ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు జమదగ్ని . తల్లిని తిరిగి బ్రతికించి ఏలుకొమ్మన్నాడు పరశురాముడు . కొడుకు కోరగానే ఆ మాతృమూర్తికి ప్రాణం పోసాడు , తిరిగి స్వీకరించాడు . అదే విధంగా తప్పు చేసిన భార్యను శాపం తీరగానే అక్కున చేర్చుకున్నాడు గౌతముడు . వారిరువురి కుమారుడైన శతానందునికి ఇంతకంటే సంతోషకరమైన వార్త ఏముంటుంది . చేసిన కార్యాన్ని అలతి మాటలలో చెప్పడం విశ్వామిత్ర మహర్షి వాక్యజ్ఞతను తెలియజేస్తుంది . విశ్వామిత్రుడు చెప్పిన మొదటి మాట ” నాతిక్రాంతం ” , ఏదీ విడవకుండా అన్ని పనులనూ చేసాను అని . హనుమ ” చూసాను సీతమ్మను” అన్న విధంగా . ఈ విధంగా రాయడం వాల్మీకికే చెల్లింది .