కేరళ రాజ్యంలోని ” కొచి” వద్ద ” త్రిక్కక్కర” అనే ప్రదేశం ఉంది . ఈ ప్రదేశాన్ని , వామన మూర్తి బలి చక్రవర్తిని పాతాళలోకానికి పంపివేసిన ప్రదేశంగా ప్రజలు భావిస్తారు . ఇచట వామనమూర్తి ఆలయం కూడా ఉంది . విచిత్రంగా ఈ ప్రదేశానికి ఇరవై మైళ్ళ దూరంలో పాతాళమనే ప్రదేశం ఉంది . త్రిక్కాళ్ కర అంటే పవిత్రమైన పాదమని అర్థం .
భూమిని దానమిచ్చిన వానికీ , దానిని ప్రీతితో పుచ్చుకొన్న వానికీ పాపాలు నశిస్తాయి . అటువంటివారు స్వర్గలోకంలో నూరేండ్లు సుఖంగా ఉంతారు . ఏ దానమూ భూదానానికి సరికాదు . నీకు కీర్తీ , పుణ్యమూ లభిస్తాయి అని వామనుడు బలితో పలికి దానాన్ని గ్రహించడానికిముందు తన శరీరాన్ని పెంచాడు . పెరిగిన ఆ శరీరం విరాట్స్వరూపమయింది . పొట్టివాడైన ఆ చిట్టివడుగు శరీరం బ్రహ్మాండాన్నంతా ఆక్రమించింది . ఈ విశ్వస్వరూపం పెరిగిపోయిన విధాన్ని పోతన్న మాటలలో కాదు కాదు పద్యంలో :
ఇంతింతై వటుడింతయై , మరియు దా నింతై , నభో వీధిపై
నంతై , తోయదమండలాగ్రమున కంతై , ప్రభారాసిపై
నంతై , చంద్రునికంతయై , ధ్రువునిపై నంతై , మహర్వాటిపై
నంతై , సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాడాంత సంవర్ధియై
ఈ విధంగా బ్రహ్మాండమంత పెరిగిపోతూ ఉంటే పొట్టిగా ఉన్న విష్ణుమూర్తి తలమీద గొడుగులాగా ఉందేది కాస్తా శిరోరత్నమైంది . చూస్తూ ఉండగానే చెవికుండలంగా కనిపించసాగింది . అరే అని చూసేవాళ్ళు విస్తుపోతూ చూసే లోపే కంఠాభరణంగా కనిపించసాగింది . కంఠాభరణం క్షణంలో మాయమయి భుజకీర్తిగా కనిపించసాగింది . సూర్యబింబమే కాంతులీనే కంకణంగా , మొలలోని ఘంటగా , కాలి అందెగా , చిట్టచివరన బ్రహ్మాండనాయకుని పద పీఠంగా మారింది .
రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై , శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్
విశ్వరూపాన్ని వర్ణించడంలో అద్వితీయమైన ప్రతిభ చూపాడు పోతనామాత్యుడు . పుణ్యమూ , పురుషార్థమూ , వీనులకు విందూ కావాలనుకునే వారు తప్పక చదవాలి బహుపసందైన బలి చక్రవర్తి కథ .